శ్రీవారి బ్రహ్మోత్సవం: భక్తుల కోసం విశేష ఏర్పాట్లు

PaperDabba News Desk: అక్టోబర్ 03, 2024

తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “శ్రీవారి బ్రహ్మోత్సవం” అక్టోబర్ 4, 2024న ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలు ధ్వజారోహణం తో  ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పిస్తారు. పూరాణిక ప్రాశస్త్యానుసారం శ్రీనివాసుడు బ్రహ్మను ఆదేశించి, లోక కల్యాణం కోసం ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారట. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో ఈ ఉత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.

శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. టిటిడి ఈ బ్రహ్మోత్సవాల కోసం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహన సేవ అక్టోబర్ 8న సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది.

టిటిడి విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనసేవలను, మూలవిరాట్ దర్శనాన్ని అందించేందుకు సర్వ సిద్ధంగా ఉన్నాయి. ఆలయ నాలుగు మాడ వీధుల్లో రంగవల్లులతో అలంకరణ చేసి, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.

అక్టోబర్ 4న ధ్వజారోహణం

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4న సాయంత్రం 5:45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం ద్వారా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా గరుడద్వజాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి సమక్షంలో అర్చకస్వాములు వేద గానాల మధ్య ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది.

వాహన సేవల విశిష్టత

పెద్ద శేష వాహనం (అక్టోబర్ 4, 2024, రాత్రి 9 గంటలకు)

మొదటి రోజు రాత్రి మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దివ్యదర్శనం ఇస్తారు. ఆదిశేషుడు శ్రీవారి సన్నిహితుడుగా ఉండడమే కాక, దాస్యభక్తికి ప్రతీకగా పూజిస్తారు. ఈ వాహనాన్ని దర్శించడం ద్వారా భక్తులు దైవత్వాన్ని పొందుతారు.

చిన్న శేష వాహనం (అక్టోబర్ 5, 2024, ఉదయం 8 గంటలకు)

రెండవ రోజు ఉదయం మలయప్ప స్వామి ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షిస్తారు. ఈ వాహనాన్ని దర్శించడం ద్వారా కుండలినీ యోగ సిద్ధి కలుగుతుందని పురాణ ప్రాశస్త్యం.

హంస వాహనం (అక్టోబర్ 5, 2024, రాత్రి 7 గంటలకు)

రెండవ రోజు రాత్రి మలయప్ప స్వామి హంస వాహనంపై సరస్వతీ దేవత రూపంలో దర్శనమిస్తారు. హంస మంచి చెడులను వేరుచేసే విశేషమైన శక్తి కలదని భక్తుల విశ్వాసం.

సింహ వాహనం (అక్టోబర్ 6, 2024, ఉదయం 8 గంటలకు)

మూడవ రోజు ఉదయం శ్రీవారు సింహ వాహనంపై దర్శనమిస్తారు. సింహం బలానికీ, ధైర్యానికి ప్రతీక. ఈ వాహన సేవ ద్వారా భక్తులు తమలోని భక్తి శక్తిని పెంపొందించుకోవాలని ఉద్దేశ్యం.

ముత్యపుపందిరి వాహనం (అక్టోబర్ 6, 2024, రాత్రి 7 గంటలకు)

రాత్రి శ్రీ మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. చల్లని ముత్యాల ప్రభావం భక్తుల కష్టాలను తొలగిస్తుందని పురాణ ప్రాశస్త్యం.

కల్పవృక్ష వాహనం మరియు ఇతర వాహనాలు

బ్రహ్మోత్సవంలో ప్రతి వాహన సేవ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని భక్తులకు అందిస్తుంది. ఈ వాహనాలను దర్శించడం ద్వారా భక్తులలో భక్తి భావం మరింత పెరుగుతుంది. అక్టోబర్ 11న రథోత్సవం జరుగుతుంది. అదే రోజు రాత్రి అశ్వ వాహనం నిర్వహించబడుతుంది.

శ్రీవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం భక్తులందరికీ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించనుంది.

 

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version