జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి ఆఫీసర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయనున్నారు. జిల్లా స్థాయి కమిటిల ద్వారా పంపిన ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపనుంది. రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.