RRR Amit Shah : నాటు నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా టీంకు అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ విందు భేటీ దాదాపుగా 40 నిమిషాల సేపు ఉంటుంది. ఆస్కార్ గెలిచినందుకు అమిత్ షా ఆత్మీయ సన్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంద. ట్రిపుల్ ఆర్ దర్శకుడు, హీరోలతోపాటు కీలకమైన యూనిట్ మొత్తాన్ని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దేశానికి గర్వకారణం అయిన విజయం సాధించినందుకు గుర్తుగా ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెబుతున్నారు.
నిజానికి ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ అవార్డుల తర్వాత విడివిడిగా ఇండియాకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇండియాకు వచ్చిన తర్వాత అమిత్ షాను కలిశారు. అలాగే సినిమా ఇంకా ఆస్కార్ విజయం సాధించకముందు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను హోటల్కు పిలిపించుకుని అభినందించారు. అయితే ఇప్పుడు అధికారికంగా టీం మొత్తానికి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆస్కార్ అవార్డు సాధించినప్పటి నుండి రాజమౌళి టీంకు వరుసగా సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ శిల్పకళావేదికలో తెలుగు చిత్రపరిశ్రమ ఘనంగా సత్కరించింది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్మాన కార్యక్రమం ఓ మంచి జ్ఞాపకం, గర్వించదగ్గ ప్రోత్సాహం అయిందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వివిధ నగరాల్లో విదేశాల్లో కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో సన్మాన సభను ఏర్పాటు చేయనుంది. ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రం RRR . ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.