వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తూ వారి బాగుకోసం పాటు పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాను అందిస్తున్న ఆర్థిక సాయం ద్వారా అక్కచెల్లెమ్మలు ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు అని అన్నారు. అలాంటి అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నానని, వీరికి భరోసా ఇచ్చే కార్యక్రమం ఈబీసీ నేస్తం అని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
జగనన్న ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేశారు. ఇలా ఇప్పటిదాకా మూడేళ్లలో మొత్తం రూ.45 వేలు ఆర్థిక సాయం చేసినట్లయింది. నేడు ఖాతాల్లోకి బదిలీ చేసిన సొమ్ము మొత్తం రూ.658.60 కోట్లు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు.