- జగన్ కాపుల కళ్లు పొడిచారు-టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
వైసీపీ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత ఏ ప్రభుత్వంలో జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం, అవమానం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. జగన్ కాపుల్ని ఆర్దికంగా, రాజకీయంగా అణిచి వేసి కాపుల కళ్లు పొడిచారు. అధికారంలోకి వచ్చీ రాగానే కాపుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5శాతం రిజర్వేషన్ను ఎత్తివేశారు. ఇచ్చిన రిజర్వేషన్ను ఎత్తేసి.. కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3100 కోట్ల నిధులు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. కానీ జగన్ కాపు కార్పొరేషన్ రుణాలకు చేసుకున్న దరఖాస్తులను కూడా రద్దు చేశారు. కాపులకు శాశ్వత ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పధకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధులకు లబ్ధి, ఎన్టీఆర్ ఉన్నత విద్యా పధకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చాం. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపు నాయకునికి ఇచ్చాం. కానీ జగన్ కాపు నేతల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారు.ప్రతి జిల్లాలో కాపు భవన్లను నిర్మించాం. ఒక్కో భవనానికి రూ.5కోట్లు కేటాయించాం. కానీ జగన్ కాపు భవన్ లను నిర్వీర్యం చేసి తాను మాత్రం ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటున్నారు. కాపులను అన్ని విధాల అణగదొక్కుతున్న జగన్ కి బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్దంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.