- మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారాయన .. క్యాస్ట్ కార్డు కలిసివచ్చి ఎమ్మెల్యేగా పదేపదే విజయాలతో బానే చక్రం తిప్పారు … అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన సీన్ పూర్తిగా రివర్స్ అయింది .. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేక.. పక్క పార్టీల వైపు చూడటం మొదలుపెట్టారు.. ఎట్టకేలకు మరో జాతీయపార్టీలో చేరి కీలక పదవి చేపట్టారు… అయితే అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.. దాంతో రగిలిపోతున్న సదరు నేత ఇప్పుడు మళ్లీ పక్కచూపులు చూస్తున్నారా?… అసలా నేత ఎవరు? ఆయన లెక్కలేంటి?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు …. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధిష్టానం పదవి నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను కాపు సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజుకు అప్పగించింది. గత మూడేళ్లుగా ఆయనే పదవిలో ఉన్నారు. తాజాగా వచ్చే ఎన్నికల వరకు సోము వీర్రాజే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని ఆ పార్టీ ప్రకటించింది … ఈ మేరకు భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటన చేసింది.మరోవైపు భీమవరంలో సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాలేదు. ఇటీవల సోము వీర్రాజు ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షులను మార్చారు … దీనిపై అప్పట్లోనే కన్నా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు … తాను బీజేపీలో చేరిన సమయంలో తనతోపాటు కొంతమంది బీజేపీలోకి వచ్చారని.. వారిని తనకు చెప్పకుండా తొలగించడం ఏమిటని విమర్శించారు … అంతేకాకుండా బీజేపీ నిర్వహించే కార్యక్రమాలు సమావేశాలకు తనకు ఆహ్వానం అందడం లేదని బాంబుపేల్చారు.
ఆ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది … జనసేన నుంచి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు … సత్తెనపల్లిలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ … జనసేన పార్టీ అక్కడ క్రియాశీలకంగా ఉంది. జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే సత్తెనపల్లిలో జనసేన పోటీ చేస్తుందని అంటున్నారు. దీంతో కన్నా సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది.తాజాగా భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాలేదు. వాస్తవానికి బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి కన్నా ఒక్కరికే ప్రాతినిధ్యం ఉంది. అలాంటి సమావేశాలకు కన్నా హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కన్నా గైర్హాజరుతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు బీజేపీ అధిష్టానం వరకు చేరాయంటున్నారు
ఇటీవల ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గం భేటీకి కూడా కన్నా వెళ్లలేదు. ఈ సమావేశాల్లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వంటివారు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు హాజరై వారితో మాట్లాడే అవకాశం ఉన్నా కన్నా వినియోగించుకోకపోవడం గమనార్హం. దీంతో కన్నా అసంతృప్తికి కారణమేమిటో తెలుసుకునే పనిలో బీజేపీ అధిష్టానం ఉందన్న టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ సైతం గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు …. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తనకు తన వర్గానికి కావాల్సినవి దక్కించుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. … మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు తాజాగా గుంటూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వకపోతే బీజేపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కన్నా అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా ఆయన అనుచరులు మీడియా ముందుకు వచ్చే అవకాశమే లేదు… అంటే కన్నా మొత్తానికి తనదైన గేమ్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారని దీనిద్వారా స్పష్టమవుతోందంటున్నారు … మరి ఆ సీనియర్ నేత స్ట్రాటజీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి…