- వైసీపీకి ఆనం వీడ్కోలు చెబుతున్నారా..?
- ఆయన్ను వదిలించుకోవాలని పార్టీ ప్లాన్ చేసిందా..?
వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. అధిష్టానంపైనే ఎమ్మెల్యేలు నేరుగా విమర్శలు చేస్తున్నారు.కొందరైతే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అలాంటి నేతలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు పార్టీ పెద్దలు ఇందులో భాగంగా ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆనం చేసిన విమర్శలకు జగన్ గట్టిగా బదులిచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనికి రుజువుగా నిలుస్తోంది ఓ మెసేజ్. ఇటీవల కొత్తగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్య నుంచి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఓ మెసేజ్ వచ్చింది.
అందులో ఏం ఉంది అంటే..? గడపగడపకు కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం మరువలేనిది, అందుకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య మేసేజ్ పంపించారు. అంటే ఇకపై ఆనం రామనారాయణ రెడ్డి గడప గడప కార్యక్రమాలకు రాకూడదని అర్థమా, లేకా ఆయన వచ్చినా అధికారులు ఆయనకు సహకరించబోరని అర్థమా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మొదట వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఆ తరువాత ఎమ్మెల్యే ఆనంకు గన్ మెన్ల సంఖ్యను కుదించారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆనం రామనారాయణరెడ్డికి పంపిన మేసేజ్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ మెసేజ్ తో పరోక్షంగా ఆనంకు వైసీపీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టయింది అనే టాక్ వినిపిస్తోంది. ఆ మెసేజ్ వైసీపీ నుంచి వచ్చిందా, లేక రామ్ కుమార్ రెడ్డి ఆదేశమా అనేది తేలాల్సి ఉంది. అయితే అధిష్టానం ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేను పార్టీ ఇంఛార్జ్ అలా అంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే తాజా పరిణామాలపై ఆనం కూడా సీరియస్ గా ఉన్నారు. పార్టీలో ఇన్ని అమానాలా..? ఇలా అయితే ఇక కొనసాగలేనని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీలో జరుగుతున్న అంశాలని వివరించి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు ఆయన వైసీపీకి దూరం జరిగారు. పైగా వైసీపీ సైతం ఆనంని దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఆనం ఇంకా వైసీపీకి వీడ్కోలు చెప్పేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.