- శ్రీవాణి ట్రస్టు క్రింద చేపట్టిన 980 దేవాలయాలు ఫిబ్రవరి 1 కల్లా గ్రౌండ్ చేయాలి.
- ప్రతి 30 దేవాలయాలకు ఒక ఏ.ఇ.ని నియమించుకోండి, నిర్మాణ పనులను వేగవంతం చేయండి.
- 30 కంటే తక్కువ దేవాలయాలు ఉన్న జిల్లాల్లోని నిర్మాణ పనులు మే కల్లా పూర్తిచేయాలి.
- శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనుల డి.పి.ఆర్.ను పటిష్టంగా రూపొందించాలి.
- ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సహాయంతో చేపట్టబడిన 980 దేవాలయాల నిర్మాణ పనులు అన్నీ ఫిబ్రవరి 1 కల్లా గ్రౌండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి & దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్ నుండి అన్ని జిల్లాల ఎండోమెంట్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన పాల్గొని దేయాలయాల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. జిల్లాల వారీగా మంజూరు చేసిన దేవాలయాలు, వాటిలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఇంకా ఎన్ని గ్రౌండ్ చేయాల్సి ఉంది, గ్రౌండ్ అయిన దేవాలయాల నిర్మాణ పనుల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ఎండో మెంట్ అధికారులు, ఏ.ఇ.,లు, డి.ఇ.లకు దిశా నిర్థేశం చేస్తూ వారికి పలు ఆదేశాలను ఆయన జారీచేశారు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి & దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పలు గ్రామాల్లో హిందూ దేవాలయాలను నిర్మించేందుకు టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సహాయంతో 980 దేవాలయాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ దేవాలయాల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ల ప్రమేయం ఏమాత్రం లేకుండా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకే వీటి నిర్మాణ పనుల బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. అయితే దేవాలయాల నిర్మాణ పనుల పురోగతి ఆశాజనకంగా లేకపోవడం, సత్తనడకగా సాగడాన్ని ఆయన గమనించి, ఈ దేవాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని జిల్లాల ఎండోమెంట్ అధికారులు తరచుగా క్ష్రేత్ర స్థాయిలో పర్యటిస్తూ దేవాలయాల నిర్మాణ పనులును పర్యవేక్షిస్తుండాలని, ఆయా దేవాలయాల పురోగతి కనిపించే విధంగా సెల్పీలతో ఫొటోలు దిగుతూ వాటిని ఉన్నత అధికారులకు పంపాలని ఆదేశించారు. ఈ దేవాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ప్రతి 30 దేవాలయాలకు ఒక ఏ.ఇ.ని నియమించుకొనేందుకు అవకాశం ఇవ్వడం జరిగిందని, ఇంజనీరింగ్ అభ్యర్థులు దొరకపోయినా కనీసం డిప్లొమా అభ్యర్థులను ఏ.ఇ.లుగా నియమించుకొని దేవాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 30 కంటే తక్కువ దేవాలయాలు ఉన్న జిల్లాల్లో ని దేవాలయాల నిర్మాణ పనులను మే కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మంజూరు చేసిన దేవాలయాలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటి పర్యవేక్షణ కష్టతరంగా ఉందని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు చేసిన విజ్ఞాపనకు మంత్రి స్పందిస్తూ కనీసం 15 లేక 20 దేవాలయాలకు ఒక ఏ.ఇ.ని నియమించుకొని దేవాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.పటిష్టమైన డి.పి.ఆర్.ను రూపొందించాలి.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనులకు సంబందించి పటిష్టమైన డి.పి.ఆర్.ను రూపొందించాలని ఆ దేవస్థానం అధికారులను ఉప ముఖ్యమంత్రి & దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. అన్నదాన భవనం, మల్టీ లెవిల్ పార్కింగ్ భవనం, క్యూ కాంప్లెక్సు, లడ్డూ పోటు భవనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబందించి ఖచ్చితమైన అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందిచాలని ఆదేశించారు. ఈ దేవస్థానం అభివృద్దికి సంబంధించి అధికారులు రూపొందించిన అంచనాలు, ప్రణాళికలపై సమగ్రంగా ఆయన చర్చించారు. రూ.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిని ఘాట్ రోడ్ అభివృద్దిపనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, కొండ చరియలు విరిగి పడకుండా చేపట్టిన రాక్ మిటిగేషన్ పనుల ప్రగతిని కూడా ఆయన సమీక్షించారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్ చార్జి ప్రిన్సిఫల్ సెక్రటరీ మరియు కమిషనర్ ఎం.హరి జవహర్ లాల్, అదనపు కమిషనర్లు టి.చంద్రకుమార్, కె. రామచంద్రమోహన్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.