పత్రికా ప్రకటన
ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణదొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1ని జారీ చేసింది. నిరంకుశ నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న జగన్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. జీవో నెం.1 చీకటి జీవోగా చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430 తెచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశ్యంతో జీవో నెం.1 తెచ్చారు. ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు అనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే. జగన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దుర్మార్గం. ఉద్యమం అనే మాట ఎంతో పవిత్రమైనది. ప్రభుత్వ అన్యాయాలను, అవినీతిని, ప్రజా సమస్యలను ఎండగడుతూ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించే హక్కుల సాధనకు ఆయుధంగా ఉన్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అసలు సభలే పెట్టకూడదు, సమావేశాలు నిర్వహించకూడదు అనేలా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు సభలు, సమావేశాలు, రోడ్ షోలకు ప్రజల నుంచి అశేషమైన ప్రజాదరణ వస్తుండడంతో చూసి ఓర్చుకోలేకే జీవో నెం.1తో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిరసన తెలియజేసే హక్కు లేదా? వైయస్ జగన్మోహన్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న విషయం ఈ ఉత్తర్వుల ద్వారా మరోసారి స్పష్టమైంది. ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అవసరమైన భద్రత కల్పించకుండా ప్రజల ప్రాణాలు బలిగొంటున్నది జగన్రెడ్డి కాదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్రెడ్డి నిర్వహించిన సభలు, సమావేశాలకు, పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే జగన్రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవాడా? జగన్రెడ్డి పాదయాత్ర నుంచి రోడ్షోల వరకు ప్రతి కార్యక్రమానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అవసరమైన భద్రతా చర్యలు కల్పించడం జరిగింది. ఇప్పుడు కనీస భద్రత కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ వేధింపులకు, ఆంక్షలకు భయపడేది లేదు. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు అండగా నిలుస్తుంది.
కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు